గెలుపు కష్టమే! బీఆర్ఎస్ సిట్టింగులు, లీడర్లలో టెన్షన్

by Disha Web Desk 4 |
గెలుపు కష్టమే! బీఆర్ఎస్ సిట్టింగులు, లీడర్లలో టెన్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. ఎలాగైనా విజయం సాధించాలని ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ సిట్టింగులు, లీడర్లలో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేననే అనుమానం వారిని వెంటాడుతున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని వారు భావిస్తున్నారు.

తీవ్రంగా కష్టపడితే తప్ప విజయం సాధించలేమని ఆందోళన చెందుతున్నారు. అందుకు ఇప్పటి నుంచే రంగంలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓ వైపు దశాబ్ది వేడుకలు పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. విపక్షాలపై మాటలదాడి చేయడంతో పాటు ప్రజల్లో వాటిని చులకన చేసే వ్యూహాలు అమలు చేస్తున్నారు.

పథకాలకు ఓట్లు వస్తాయా?

రాష్ట్రంలో ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. కానీ అవి తిరిగి గెలిపిస్తాయనే నమ్మకం సిట్టింగులు, లీడర్లలో కలగడం లేదు. దళిత బంధు, రైతు బంధు, రైతుబీమా, ఆసరా, తదితర స్కీమ్స్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నా.. అవి వర్కవుట్ కావనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. దళితబంధు కింద ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షల సాయం అందిస్తామంటూ హుజూరాబాద్ ఉప ఎన్నిక టైంలో స్కీం తీసుకొచ్చినా అధికార పార్టీకి చేదు అనుభవమే మిగిలిందని, మునుగోడు బై ఎలక్షన్‌లోనూ అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదన్న విషయాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

గెలవాలనే లక్ష్యంగా ఓటరుకు నేరుగా భారీ స్థాయిలో డబ్బులు పంచినా ఆ ఉప ఎన్నికల్లో ప్రయోజనం కలుగలేదు. సామాన్య కార్యకర్త మొదలుకుని సీఎం వరకు అందరూ రాత్రింబవళ్లు తీవ్రంగా కష్టపడినా.. మునుగోడులో బీజేపీ అభ్యర్థికి కేవలం 10వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే కేవలం సంక్షేమం, అభివృద్ది పథకాలు సరిపోవనే నిర్ణయానికి బీఆర్ఎస్ సిట్టింగులు, లీడర్లు వచ్చినట్టు సమాచారం.

ఒక్కో సెగ్మెంట్‌కు రూ.20 కోట్లు?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్స్, రోడ్డు షోలు, ర్యాలీలు, గ్రామాల్లో దావత్‌లు, ప్రతి కుటుంబానికీ ప్యాకేజీలు ఇస్తూ జనాలను వీలైనంత ఎక్కువగా ఆకర్షించేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. సగటును ఒక్కో ఓటరుకు కనీసంగా రూ.పదివేల వరకు ఖర్చు చేసేలా బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

2018 ఎన్నికల్లో ప్రతి సెగ్మెంట్ రూ.10 కోట్ల వరకు గులాబీ పార్టీ ఖర్చు చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ లెక్కన ఈసారి కనిష్టంగా ఒక్కో సెగ్మెంట్‌కు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేయాలని లెక్కలు వేసినట్టు తెలుస్తున్నది. పోలీసు, అధికార వ్యవస్థను పూర్తిగా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అందులో భాగంగా ఎన్నికల టైమ్‌లో తమకు అనుకూలంగా వ్యవహరించే ఆఫీసర్లకు క్షేత్ర స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు.

విపక్షాలను కట్డడి చేయడంతో పాటు చెప్పిన మాట వినే అధికారులకు అవసరమైన చోటుకు బదిలీ చేస్తున్నారు. నమ్మకం ఉన్న వారికే పోలీసు, రెవెన్యూ విభాగాల్లో నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నారు. అసెంబ్లీ సెగ్మంట్ వారీగా ఏ అధికారి ఎప్పుడు ఏం పనిచేయాలో ప్రగతిభవన్ నుంచే డైరెక్షన్ వెళ్లేవిధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. స్థానికంగా పార్టీ పరిస్థితులు, విపక్షాల బలాలు తదితరాలపై ఎప్పటికప్పుడు గులాబీ అధిష్టానం వివరాలు సేకరిస్తున్నట్టు టాక్.

బూత్‌ల వారీగా ఎన్నికల టీమ్

ప్రతి పోలింగ్ బూత్‌కు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయడం వల్లే మునుగోడు బై ఎలక్షన్‌లో బీఆర్ఎస్ విజయం సాధించిందని పార్టీ వర్గాల్లో టాక్. ఎన్నికల షెడ్యూలు మొదలుకుని ఓటింగ్ పూర్తయ్యే వరకు నలుగురైదుగురితో టీమ్ ఏర్పాటు చేసి, ప్రతి ఓటరును కలిసే విధంగా ప్లాన్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

అందులోభాగంగా ఇప్పటి నుంచే బూత్ స్థాయి టీమ్‌లను రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. నమ్మకమైన కార్యకర్తలతో టీమ్ ఏర్పాటు చేసి మొత్తంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు, ఓటర్లను పోలింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఓటు వేయించే వరకు ప్రతి ఓటరుతో టచ్‌లో ఉండేలా ఆ టీంలకు బాధ్యతలు అప్పగించనున్నారు. అందుకోసం ఎంత ఖర్చయినా ఫర్వాలేదని నిర్ణయానికి గులాబీ పార్టీ వచ్చినట్టు సమచారం.

Also Read...

యువతకు ఉపాధి.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్



Next Story

Most Viewed